తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (యాదాద్రి)లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. మంగళవారం ఉదయం ఆలయ అర్చకుల ఆచార వ్యవహారాల మధ్య ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి పూజలు నిర్వహించి సంప్రదాయం ప్రకారం బాలాలయంలో వార్షిక ఉత్సవాల నిర్వహణకు అనుమతి కోరారు. అనంతరం బాలాలయంలో వేదపండితుల స్వస్తి వచనంతో విశ్వక్సేన ఆరాధన, ఆలయ శుద్ధి తదితర పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడ్డాయి. ఈ క్రమంలో ఆలయ అర్చకులు బాలాలయంలో రక్షాబంధనం నిర్వహించారు. ఈ నెల 23 నుంచి అలంకారోత్సవాలు, 27 రాత్రి విశేష వేడుకలు జరగనుండగా.. 28న స్వామివారి కల్యాణోత్సవం, అలాగే మార్చి 1వ తేదీన దివ్య విమాన రథోత్సవం, అనంతరం మార్చి 3వ తేదీన ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఇక ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్. గీత బ్రహ్మోత్సవాల వివరాలను వెల్లడించారు. నేటినుంచి మార్చి 3వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. కాగా 2022 మార్చిలో ఆలయాన్ని పునరుద్ధరించిన అనంతరం తొలిసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా నరసింహ స్వామి మరియు ఆయన సతీమణి శ్రీ లక్ష్మీ సమేతమైన తిరు కల్యాణోత్సవం ఈనెల 28న రాత్రి నిర్వహించనున్నట్లు ఈఓ గీత తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఆయన స్వామివారి కల్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరు కానున్నారని ఆమె వెల్లడించారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాదాద్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని, అలాగే ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈఓ గీత తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE