దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రేపు (ఏప్రిల్ 9, శుక్రవారం) ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో “సంకల్ప సభ” నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే పోలీసులు అనుమతి ఇవ్వగా, నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ప్రకటన చేయడంతో పాటుగా పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించనున్నట్టు సమాచారం. మరోవైపు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఈ సభలో ముఖ్య అథితిగా పాల్గొంటున్నారు.
ఖమ్మంలో నిర్వహించే సంకల్ప సభకు నాయకులు భారీ కారు ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి వందల కార్లతో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించే ఈ సభలో అన్ని కోవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి మాస్క్ లు పంపిణీ చేయడం, శానిటైజర్లు ఏర్పాటు, ఇతర నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి ఈ సంకల్ప సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ వైఎస్ షర్మిల టీం పిలుపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల ఇప్పటికే వరుసగా పలు జిల్లాల నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని, రాజన్న సంక్షేమ పాలన తేవాలన్నదే తన కోరిక అని వైఎస్ షర్మిల చెప్పారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించి, ప్రజల సహకారంతో మళ్ళీ అలాంటి స్వర్ణ యుగాన్ని తెచ్చుకుందామని సమావేశాల సందర్భంగా నాయకులకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ