సికింద్రాబాద్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో గల ఒక స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్ సామగ్రికి సంబంధించిన గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ రెగ్జిన్, సింథటిక్, ఫైబర్, ప్లాస్టిక్కు సంబంధించిన సామాగ్రి ఉండటంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటనలో నలుగురిని రక్షించామని, మరో ముగ్గురు ఆచూకీ తెలియలేదని సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. ఇక సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు, విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ ఘటనాస్థలానికి చేరుకున్నాయని సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రాజేష్ చంద్ర తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించిందని పోలీసులు తెలిపారు. దీనికోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది మొత్తం 30 ఫైరింజన్లు, 70 ట్యాంకర్లను వినియోగించినట్లు వెల్లడించారు.
కాగా గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత సెల్లార్లో మంటలు చెలరేగాయి. అనంతరం క్రమంగా భవనం మొత్తం వ్యాపించడంతో పొగ భారీగా వెలువడింది. భవనానికి మూడు పక్కల ఇతర కమర్షియల్ భవనాలు మరియు నివాస గృహాలు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఐదు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే భవనం లోపల ఉన్న సామాగ్రి వలన మంటలు అదుపులోకి రాకపోగా అంతకంతకూ పెద్దవయ్యాయి. ఈ నేపథ్యంలో భవనంలోని నాలుగు, ఐదో అంతస్థుల స్లాబ్ కూలిపోయి, మెట్లు దెబ్బతినడంతో పాటు భవనం మొత్తం బీటలు వారింది. ఈలోపల మంటలు పక్క భవనాలకు వ్యాపిస్తుండటంతో అందులోని వారు భయంతో పరుగులు తీశారు. దీంతో మరికొన్ని ఫైర్ ఇంజన్లను, వాటర్ ట్యాంకర్లను తెప్పించి జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సహా అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్విరామంగా ప్రయత్నించి చివరకు సాయంత్రానికి మంటలను పూర్తిగా అదుపులోకి తేగలిగారు.
ఇక అగ్నిప్రమాదం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. భవనం లోపల ఉన్న నలుగురిని సురక్షితంగా కాపాడారని, మరో ముగ్గురు లోపల చిక్కుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారని, వారిని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో సరైన అనుమతులు లేని భవనాలు సుమారు 25 వేలకు పైగా ఉన్నాయని, వీటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈ అగ్నిప్రమాదం ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆరా తీశారు. మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ విచారణకు ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE