ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు అందిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) నిర్ధారణ పరీక్షల నిమిత్తం మరో మూడు ల్యాబొరేటరీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో, ల్యాబొరేటరీల నిర్వాహణాధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున ఏప్రిల్ 2న గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ల్యాబ్ లు పనిచేస్తుండగా, ఏప్రిల్ 4, శనివారం నుంచి కడప, గుంటూరులలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అలాగే ఏప్రిల్ 5, ఆదివారం సాయంత్రం నుంచి విశాఖపట్నంలో ల్యాబ్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా రాష్ట్రంలో 450 కరోనా వైరస్ పరీక్షలు జరుగుతుండగా, ఈ మూడు ల్యాబ్ లు కూడా అందుబాటులోకి వస్తే రోజుకు 570 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు.
[subscribe]