తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి అనే నేను భారత రాజ్యాంగం పట్ల అంటూ.. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఎల్బీ స్టేడియం మొత్తం మారుమ్రోగిపోయింది.
ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మంత్రిగా 11 మంది ప్రమాణం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. అలాగే దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలు పదేళ్ల పాటు బాధలను మౌనంగా భరించారని వెల్లడించారు. కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణ ఇచ్చిందని అన్నారు. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాభవన్కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పుకొచ్చారు.
ఇకపోతే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకారోత్స కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యలు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎల్బీ స్టేడియానికి తరలివచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY