దేశమంతా మోదీ గాలి వీచినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ అంతంత మాత్రమే. ప్రధానంగా ఆంధప్రదేశ్లో అయితే.. భారతీయ జనతా పార్టీ ప్రాభవం లేనే లేదు. రాష్ట్ర విభజన పాపంలో ఆ పార్టీ పాత్ర కూడా ఉందని ఏపీవాసులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా.. విభజన సమయంలో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆపార్టీ పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆ విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంతగా ఆదరణ లేదు. ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగిన సమయంలో కాస్త హడావిడి చేశారు. పవన్ సహా పలువురు కీలక నాయకులను కలుస్తుండడం, జిల్లాలు తిరుగుతూ బీజేపీ శ్రేణులతో భేటీ కావడం చేశారు. తన మార్క్ రాజకీయాల ద్వారా పార్టీ పేరు నిత్యం వార్తలో ఉండేలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఓట్లు, సీట్లు పరంగా బీజేపీ సత్తా జీరో. నోటా కంటే తక్కువ ఓట్లే పడ్డాయి.
సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చినా.. పార్టీలో పెద్దగా మార్పు లేదు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీతో జట్టుకట్టడానికి టీడీపీ-జనసేన ఎప్పటి నుంచో ఉత్సాహం చూపుతున్నాయి. ముఖ్యంగా పొత్తు కావాలని చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఇదే సరైన సమయంగా బీజేపీ భావించింది. పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఏకంగా 6 ఎంపీ స్థానాలు తీసుకోవడమే కాకుండా తమ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇరు పార్టీ నేతలకు అప్పగించినట్టుగా సమాచారం.
విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, అనకాపల్లి-రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, అరకు-మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, రాజమహేంద్రవరం-రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం-సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తిరుపతి నుంచి రత్నప్రభ బరిలో నిలుస్తారని ఆ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. అలాగే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, ధర్మవరం-వరదాపురం సూరి, తిరుపతి-భానుప్రకాశ్రెడ్డి, కైకలూరు-కామినేని శ్రీనివాస్, పాడేరు-ఉమామహేశ్వరరావు, విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్రాజు పోటీ దాదాపు ఖాయమంటున్నారు. వీటితోపాటు బద్వేలు (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, మరో రెండు స్థానాల అభ్యర్థులను, లోక్సభ స్థానాల బరిలో నిలిచేవారిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలం ఎంత? ఆ పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతోంది. ఎంపీ స్థానాల విషయానికి వస్తే జనసేన కంటే మూడు రెట్లు ఎక్కువగా సీట్లు పొందింది. ఏ అంటే.. దేశంలో మోదీ గాలి ఉంది కాబట్టి తమకే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడినట్లు తెలిసింది. సరే.. ఎంపీ సీట్ల విషయంలో ఆ లాజిక్కును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. పది అసెంబ్లీ సీట్లు ఇవ్వడంపై కూడా చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీకి అంత సీను లేదని, ఒకవేళ కూటమి గాలి వస్తే.. ఆ గాలిలో బీజేపీకి చాన్స్ ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE