ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో జరుగుతున్న స్మృతి వనం పనులపై శుక్రవారం కీలక సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏప్రిల్ 14, 2023న ఆయన జయంతి సందర్భంగా ప్రారంభించేలా పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే షెడ్యూల్ ప్రకారం వార్షికోత్సవం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కాగా ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.268 కోట్లు కాగా.. 352 మెట్రిక్ టన్నుల స్టీల్, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడితో తయారయ్యే 125 అడుగుల విగ్రహాన్ని 81 అడుగుల పీఠంపై ఏర్పాటు చేసి మొత్తం పొడవు 206 అడుగులకు చేరుస్తామని అధికారులు తెలిపారు. విగ్రహంలోని కొన్ని భాగాలకు కాస్టింగ్ పూర్తయిందని, జనవరి 31 నాటికి ప్రాజెక్టు సైట్కు తరలిస్తామని, ప్రాజెక్టు స్థలంతో పాటు అక్కడికి వెళ్లే అన్ని రహదారుల్లో సుందరీకరణ పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని వివరించారు. అలాగే స్మృతి వనం ప్రాజెక్ట్ పీఠం భాగంలో గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్లతో పాటు 2000 సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్ మరియు విశాలమైన ఫోర్ వీలర్ పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎం జగన్కు వివరించారు. ఇక మార్చి 31లోగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పగా.. పనుల్లో నాణ్యత లేదని, పనుల పురోగతిని కమిటీ వేసి పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE