ఆంధప్రదేశ్ లోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి ఆద్యుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేంద్రంలోని తన మాట వింటుందనే నమ్మకంతో.. చంద్రబాబునాయుడు జైలులో ఉన్న సమయంలోనే టీడీపీతో కలిసి పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. బీజేపీ కలిసివస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నాడు. పవన్ చెప్పినట్లుగానే బీజేపీ కలిసి వచ్చింది. టీడీపీ-బీజేపీని కలపడంలో పవనే కీలకం అని చెప్పొచ్చు. ఆ కలిపే క్రమంలో ముందే చెప్పినట్లుగా కొన్ని త్యాగాలకు ఆయన సిద్ధం అయ్యారు. 40 సీట్లు అడిగి.. 24కు అదీ కాదంటే 21కు అంగీకరించారు. అయితే.. రాష్ట్రంలోని అన్నిస్థానాల్లోనూ పోటీ చేస్తామని ఊరారా తిరిగి.. ఎన్నికల సమయం వచ్చేసరికి కూటమితో జట్టుకట్టి 21కు పరిమితమైన పవన్.. ఆ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడానికి సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారు. అంతేకాదు.. తాను పోటీచేసే స్థానాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
అయితే.. తాజాగా జనసేన పోటీ చేసే మరో 10 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారుచేసినట్లు తెలిసింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జిల్లాల వారిగా పోటీ చేసే అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా చర్చించారు. ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు (ఎస్సీ)లో మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు ఖరారైంది. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, పెందుర్తిలో పంచకర్ల రమేశ్బాబు, యలమంచిలిలో సుందరపు విజయ్కుమార్ అభ్యర్థిత్వాలను ఆమోదించినట్లు సమాచారం. ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం-పులపర్తి రామాంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్లను ఖరారు చేశారు.
భీమవరం అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా పిఠాపురంలో పవన్ పోటీ ఖాయమే అని తెలుస్తోంది. తిరుపతి సీటుపై ఆయన బాగా తర్జనభర్జన పడ్డారు. ఇక్కడ నేతల నడుమ పోటీ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. తొలి నుంచీ జనసేనలో ఉన్నవారు.. టీడీపీ, వైసీపీల నుంచి వచ్చి చేరినవారు పెద్దఎత్తున ప్రయత్నాలు చేశారు. చివరకు ఇటీవల జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైపు పవన్ మొగ్గుచూపారు. గతంలో రెండు దఫాలుగా ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పై పది మందితో కలిపి 16 మంది అభ్యర్థులు ఖరారైనట్లయింది. మిగిలిన ఐదు సీట్లలో బరిలోకి దిగే అభ్యర్థులపై కసరత్తును గురువారం పూర్తిచేయాలని.. 15వ తేదీ లేదా 17న జనసేన పోటీచేసే మొత్తం 21 అసెంబ్లీ సీట్లు, అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని పవన్ యోచిస్తున్నట్లు సమాచారం. అప్పుడే పవన్ పోటీచేసే స్థానంపై కూడా అధికారిక ప్రకటన వెల్లడికానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE