భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని టీడీపీ, జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని తమ కార్యకర్తలకు వివరిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చంద్రబాబు నేతలకు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 17న టీడీపీ-జనసేన-బీజేపీ నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్మానించినట్లు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తాయని ఇదివరకే వెల్లడించారు. 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల శ్రేణులు పాల్గొంటాయని.. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తాజాగా పేర్కొన్నారు. ఈసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినాయకత్వం లోకేష్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు ఏర్పాట్లను నిత్యం సమీక్షిస్తున్నారు. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి లోకేష్ చర్చిస్తున్నారు. లక్షలాదిగా ప్రజలు రానున్న ఈ సభ ద్వారా కూటమి ఐక్యతను చాటి చెప్పాలని మూడు పార్టీల నాయకులూ భావిస్తున్నారు.
అయితే.. పార్టీ అధినేతలు కలిసికట్టుగా కలిసి తిరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా కనిపించడం లేదు. ఆయా పార్టీల కార్యకర్తల మధ్య సయోధ్య ఉండడం లేదు. టీడీపీ-జనసేన సంగతి అటుంచితే.. బీజేపీ తో జతకట్టడం ఇరు పార్టీలలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాషాయపార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్న అసంతృప్తి చాలామందిలో ఉంది. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై కామ్రేడ్లు కూడా కన్నెర్ర చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్కు పాచిపోయిన లడ్డూలు తియ్యగా కనిపిస్తున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో ఏర్పడింది విద్రోహ కూటమిగా అని విమర్శించారు. 2024లో ఏపీలో టీడీపీ, వైసీపీ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోదీ పల్లకీ మోయాల్సిందే అన్నారు. బీజేపీ కూటమిని ఓడించే సత్తా వైసీపీకి లేదన్న ఆయన.. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొత్తుల నాటకం ఆడుతోందని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ప్లాంట్, రైల్వే జోన్, రాజధాని విషయంలో ఏం చెప్పినా ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే అన్నారు శ్రీనివాసరావు.. అప్పట్లో పాచిపాయిన బీజేపీ లడ్డూలు.. పవన్ కల్యాణ్కు ఇప్పుడెందుకు తియ్యగా అనిపిస్తుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. కామ్రేడ్ల కామెంట్లతో జనసేన-టీడీపీలోని కొందరు నేతలు కూడా ఏకీభవిస్తున్నారు. ఈక్రమంలో కూటమి ఐక్యత క్షేత్రస్థాయిలో మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE