ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి వీలుగా ఏప్రిల్ 7న చివరిసారిగా కేబినెట్ మీటింగ్ జరుపనున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోని మొత్తం 24 మంది సభ్యులు ఒకేసారి తమ రాజీనామాలను సమర్పించనున్నారు. ఈ క్రమంలో కొత్త కేబినెట్ ఏప్రిల్ 11న కొలువుదీరనుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత చాలావరకు కొత్త వారే ఉంటారని, ప్రస్తుత బృందం నుంచి కనీసం నలుగురిని మళ్లీ చేర్చుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే జిల్లాకొకరికి చొప్పున అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే కేబినెట్ ఏర్పాటులో సామజిక వర్గాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుత కేబినెట్ జూన్ 8, 2019న ఏర్పాటు చేయబడింది, డిసెంబర్ 8, 2021 వరకు ఉనికిలో ఉండాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడింది. ఉగాది పండుగ నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని సీఎం జగన్ గత నెలలో ప్రకటించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో ప్రస్తుత కేబినెట్ నిర్మాణం అలాగే ఉంటుంది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, వెనుకబడిన కులాలు, కాపు వర్గాలకు చెందిన ఒక శాసనసభ్యుడికి ఒక్కొక్కరికి ఒక్కో డీసీఎం పదవి ఇస్తారు. ఇక సామాజికవర్గాల లెక్కల ఆధారంగా, కనీసం నలుగురు ప్రస్తుత మంత్రులను కొత్త కేబినెట్ లోకి తిరిగి చేర్చుకోవచ్చని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ