ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఖాళీలున్నా, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడంలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన సీఎం జగన్, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఏపీలోని నిరుద్యోగ యువకులు రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయశాఖలో, నీటిపారుదల శాఖలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని వీర్రాజు లేఖలో డిమాండ్ చేశారు.
సరైన సమయానికి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ యువకుల వయసు దాటి పోతోందని, దీని వలన వారు జీవితకాలం నష్టపోతారని వీర్రాజు లేఖలో గుర్తుచేశారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో డిగ్రీ పూర్తిచేసిన యువతకు అవకాశం కల్పించేలా నిబంధనలను మార్చాలని కోరారు. తమ శాఖలో 1,148 ఖాళీ పోస్టులు ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చినాకూడా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సోము వీర్రాజు సీఎంకు రాసిన లేఖలో సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ