ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ సేకరణ, ఆసుపత్రుల్లో సదుపాయాలు సహా అనేక అంశాలపై అధికారులకు సీఎం వైఎస్ కీలక సూచనలు చేశారు.
300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్:
ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా మెడికల్ ఆక్సిజన్ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేరాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. “రోజుకు ప్రస్తుతం మెడికల్ ఆక్సిజన్ వినియోగం 600 టన్నులు దాటిన దృష్ట్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. రాష్ట్రంలో ప్రతిపాదిత కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు, కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్కు ఉపయోగపడేలా, అదే సమయంలో రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఒక ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించే ఆలోచన చేయాలి.
కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ యుద్ధప్రాతిపదికన తీసుకొచ్చే విషయమై దృష్టి పెట్టాలి. కనీసం 300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆ ప్లాంట్ ఉండాలి. ఇప్పుడున్న ఆక్సిజన్కు ఇది అదనం అవుతుంది” అని చెప్పారు.
ఆక్సిజన్ సేకరణ, సరఫరా, నిల్వపై సమీక్ష:
ఇక రాష్ట్రంలో ఏప్రిల్ 20 నాటికి 360 మెట్రిక్ టన్నులు కేటాయింపులు ఉంటే ప్రస్తుతం వినియోగం సుమారు 600మెట్రిక్ టన్నులకు పైగా చేరిందని తెలిపిన అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 టన్నులు వరకూ ఉన్నాయని, ప్రత్నామ్నాయ విధానాల ద్వారా ఆ లోటు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు వివరించారు. వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్ స్టోరేజ్ ట్యాంకులు పంపిణీ చేశాం. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాల సంఖ్యను 56 నుంచి 78కు పెంచాం. ట్యాంకరు రాగానే దాని నుంచి రీఫిల్ చేసి పంపిణీ చేయడానికి మరో 14 వాహనాలను ఏర్పాటు చేశాము, పాత వాహనాల్లో ఉన్న ట్యాంకర్లకు మరమ్మత్తులు చేసి 44 కిలోలీటర్ల స్టోరేజీని ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి రోజుకు 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకు రావడానికి 36 వాహనాలను వినియోగిస్తున్నాం. ఇందులో నాలుగు వాహనాలను ప్రతిరోజూ విజయవాడ నుంచి వైమానిక దళం విమానం ద్వారా భువనేశ్వర్కు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రానికి 2 ఐఎస్ఓ ట్యాంకర్లు వస్తున్నాయని, వాటిని దుర్గాపూర్లో ఆక్సిజన్ నింపి తీసుకొస్తున్నామని, వచ్చే నెల (జూన్) మధ్యంతరానికి మరో 25 ట్యాంకర్లు వస్తున్నాయన్న అధికారులు పేర్కొన్నారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సామర్థ్యం పెంచండి:
అనంతరం సీఎం వైఎస్ స్పందిస్తూ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లకు అనుగుణంగా సరైన ప్రెజర్తో ఆక్సిజన్ వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్న చెప్పారు. నేవీ, ఇతర సాంకేతిక సిబ్బంది సహాయం తీసుకుని ప్రెజర్ తగ్గకుండా అందరికీ సమరీతిలో ఆక్సిజన్ వెళ్లేలా చూడాలన్నారు. దీని కోసం అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. కాగా, ఆస్పత్రిలో పైపులైన్లను పరిశీలించి, అవసరమైన మార్పులు చేస్తున్నామని, అదే విధంగా పైపులైన్ వ్యవస్థను మెరుగుపరచడానికి నేవీ సహకారం తీసుకుంటున్నామని
అధికారులు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో కోవిడ్ రోగులకు మరిన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. 15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 10 వేల డి-టైప్ సిలెండర్లను త్వరలోనే ఆస్పత్రులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అదనంగా 250 వెంటిలేటర్ల ఏర్పాటు చేస్తుండగా, వాటిలొ ఇప్పటికే 50 సరఫరా చేశామని అధికారులు తెలిపారు. 125 కిలోలీటర్ల మెగా స్టోరేజీ ట్యాంకు కోసం విధి విధానాలు ఖరారు చేస్తున్నామని అధికారులు పేర్కొనగా, దీన్ని ప్రతిపాదిత ఆక్సిజన్ తయారీ ప్లాంట్ వద్ద పెట్టించాలన్న సీఎం సూచించారు. కొత్తగా 6500 మెడికల్ గ్యాస్ పైపులైన్ల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం చేస్తుందని, అలాగే రాష్ట్రంలోని 53 చోట్ల పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
జర్మన్ హ్యాంగర్లు:
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆస్పత్రులకు వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా వాటి ఆవరణల్లో జర్మన్ హేంగర్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడున్న ఏరియాను బట్టి కనీసం 25 నుంచి 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ జర్మన్ హేంగర్ల ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు.
ఆస్పత్రులు–బెడ్లు:
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్స కోసం 669 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 47,693 బెడ్లు ఉండగా, వాటిలో 39,749 బెడ్లు ఆక్యుపైడ్ అని, వాటిలో సగానికి పైగా అంటే 26,030 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక అన్ని ఆస్పత్రులలో ఐసీయూ బెడ్లు 6513, నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు 23,357, నాన్ ఐసీయూ నాన్ ఆక్సీజన్ బెడ్లు 17,823 ఉన్నాయన్న అధికారులు మొత్తం 3460 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. గతేడాది సెప్టెంబరులో కరోనా తొలిదశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం 261 ఆసుపత్రులను గుర్తించగా వాటిలో మొత్తం 37,441 బెడ్లు, 2279 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 669 ఆస్పత్రులను కోవిడ్ చికిత్స కోసం గుర్తించగా, వాటిలో 47,693 బెడ్లుతో పాటు 3,460 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
కోవిడ్ చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు. జీడీఎంఓ. స్టాఫ్ నర్సులు. టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు కలిపి మొత్తం 17,901 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వివరించారు.మరోవైపు అన్ని జిల్లాలలో కలిపి ఇప్పుడు ఎన్–95 మాస్కులు 6,42,911, పీపీఈ కిట్లు 7,18,086. సర్జికల్ మాస్క్లు 38,26,937. హోం ఐసొలేషన్ కిట్లు 82,884. రెమిడిస్విర్ ఇంజక్షన్లు 21,340 ఉన్నాయని అధికారులు తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు:
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు వచ్చాయి. వాటిలో కోవీషీల్డ్ 62,60,400 కాగా, కొవాక్సిన్ 12,89,560 డోస్లు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిల్చినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సీన్లు సరఫరా చేసే కంపెనీలు మూడు వారాల్లో తమ బిడ్లు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజుతో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ