ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం వచ్చే వారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కరోనా చికిత్స కోసం వచ్చే వారందరూ ముందుగా ఇక్కడి ఆసుపత్రుల్లో బెడ్ రిజర్వు చేసుకుని, అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్లకు లేఖ రాశారు.
“వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని ఏ ఆసుపత్రితోనూ ముందస్తు అనుమతి లేకుండా చికిత్స కోసం ఆసుపత్రులలో చేరేందుకు అంబులెన్సులు లేదా ప్రైవేట్ వాహనాలలో తెలంగాణకు వస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆసుపత్రులలో ముందస్తు అనుమతి లేకపోతే, కరోనా బాధితులు ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి వెళ్ళే విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా, వివిధ కరోనా స్ట్రెయిన్స్ వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆసుపత్రుల్లో ఇతర రాష్ట్రాల పేషంట్స్ చేరేందుకు మార్గదర్శకాలను జారీ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే:
- కరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషంట్స్ తెలంగాణలోని ఆసుపత్రితో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవాలి.
- తెలంగాణలోని ఆసుపత్రులు కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్ 040-24651119 మరియు 9494438251 (వాట్సాప్), (ఇమెయిల్: [email protected]) కు నిర్దేశించిన ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలి. కరోనా పేషంట్స్ పేరు, వయస్సు, రాష్ట్రం, అటెండర్ పేరు, మొబైల్ నంబర్ మరియు బెడ్ టైప్/ఏ చికిత్స కోసం వస్తున్నారో వంటి ప్రాథమిక వివరాలను అందించాలి.
- ఆసుపత్రి నుండి ప్రతిపాదన అందిన తరువాత, కంట్రోల్ రూమ్ పేషంట్ ప్రయాణానికి అనుమతి జారీ చేస్తుంది, దీని ఆధారంగా ఆయా కరోనా పేషంట్లు ఆసుపత్రిలో చేరడానికి తెలంగాణ రాష్ట్రానికి రావచ్చు.
- ఈ మార్గదర్శకాల సమాచారాన్ని ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ