ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆరోగ్యశ్రీ అమలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపి, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇకపై ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా రూ.5 వేలు ఇవ్వాలని చెప్పారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3 వేలు ఇస్తుండగా, దీన్ని రూ.5 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. సహజ ప్రసవం అయినా, సిజరేయన్ అయినా తల్లిబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలని, సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదే అని సీఎం స్పష్టం చేశారు.
అలాగే ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అధికారులు సీఎంకి వివరించారు. ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని చెప్పగా, దీనిపై నిరంతర అధ్యయనం చేస్తూ, అవసరాల మేరకు మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశించారు. నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు, 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు, ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు మొత్తంగా రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. గత ఏడాది ఆయుష్మాన్భారత్ కింద రూ.223 కోట్లు వచ్చిందని, ఈ ఏడాది రూ.360 కోట్లు ఇస్తామని అంచనాగా చెప్పారని అధికారులు వెల్లడించారు. ఇక మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసేందుకు నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లించేలా, ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారంతో, ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. కరోనా పరిస్థితులన్నీ పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని అధికారులు తెలుపగా, అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండు డోసులు దాదాపుగా పూర్తి అయ్యాయని, 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి 99.65 శాతం, 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. అదేవిధంగా విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY