జూలైలో భారతదేశ అత్యున్నత పదవికి (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార బీజేపీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నాలు మొదలెట్టిన విషయం తెలిసిందే. అయితే బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో విపక్షాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా పార్టీల మధ్య పలు వరుస సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ పేరు వినిపిస్తుండటం విశేషం. ఈ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ నిలబడనున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి పదవికి శరద్ పవార్కు కాంగ్రెస్ మద్దతు తెలిపినట్లు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సందేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గత గురువారం శరద్ పవార్తో సమావేశమయ్యారు. వీరిద్దరూ ముంబైలో కలుసుకున్నారు. ఖర్గే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లతో కూడా మాట్లాడినట్లు, ఈ మేరకు వారి మద్దతును కోరినట్లు తెలుస్తోంది. దీనికి వారు సుముఖంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రతిపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా ఖర్గే ఫోన్లో మాట్లాడారు.
అయితే ఆ సూచనపై ఎన్సీపీ అధినేత స్పందించలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవార్కు మద్దతుగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన శరద్ పవార్ అనేక పొత్తులు మరియు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పరచడంలో ఘనత వహించారు. అన్ని రాష్ట్రాలలో మరియు అన్ని పార్టీల నాయకులతో పవార్కు సన్నిహిత సంబంధాలు ఉండటం అలిసి వచ్చే విషయంగా కాంగ్రెస్ భావిస్తోంది. మహారాష్ట్రలో బిజెపిని అడ్డుకునేందుకు సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న శివసేన, ఎన్సిపి మరియు కాంగ్రెస్లను ఏకతాటిపైకి తెచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఆయనదే కీలక భూమిక.
దేశవ్యాప్తంగా గల ఎమ్మెల్యేలు మరియు ఎంపీల ఓట్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు రూపంలో మొత్తం 4,809 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్ర జనాభా, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓటు విలువ మొత్తం 10,86,431 కాగా, ఏ అభ్యర్థికయినా 50 శాతం ఓట్లు దాటితే గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే బీజేపీ, దాని మిత్రపక్షాలు మెజారిటీ మార్కుకు 13,000 ఓట్ల దూరంలో ఉన్నాయి. కాగా ఇంతవరకూ బీజేపీ తన అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ