ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ ఒక కొత్త యాప్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో హోం శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఫోరెన్సిక్ విభాగంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా నేర పరిశోధనలో సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. అవినీతిపై ఫిర్యాదుల కోసం దిశా యాప్ తరహాలో కొత్తగా ఏసీబీ యాప్ ఏర్పాటు చేయాలని, నెల రోజుల్లోగా ఈ యాప్ రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ యాప్ ద్వారా ఆడియో ఫార్మాటులో కూడా ఫిర్యాదులు పంపవచ్చని సీఎం జగన్ తెలిపారు.
ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లో నమోదయ్యే అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టి సరిస్తుందని, దీనికోసం మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ను ఉపేక్షించవద్దని, రూట్స్ నుంచి తుడిచిపెట్టేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా దిశ, ఎస్ఈబీ, ఏసీబీ శాఖల సేవలను విస్తృతంగా ప్రజలకు సేవలందించేందుకు చూడాలని సీఎం జగన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. అవినీతికి ఆస్కారం ఉన్న ప్రభుత్వంలోని శాఖలపై ఏసీబీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. సామాన్య ప్రజలు అవినీతి కారణంగా సంక్షేమ పథకాలను సరిగా అందుకోలేకపోతే అది అంతిమంగా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ