కలిసి ఉంటే కలదు సుఖం.. అంటారు పెద్దలు. కానీ.. రాజకీయాల్లో ఏ రెండు పార్టీలూ కలిసి ఎక్కువ కాలం నడవడం అనేది కష్టమే. కూటమి పేర్లతో జట్టుకట్టినా. సీట్ల పంపకంలోనో, అంతర్గత కలహాలతోనో ఇబ్బందులు రావడం పక్కా. గుంటూరు లోక్సభ పరిధిలో మాత్రం.. రాజకీయాల్లో గుంటూరు రాజకీయాలు వేరయ్యా.. అన్నట్లుగా ఉంది.. ప్రస్తుతం అక్కడి రాజకీయ చిత్రం. ఇక అసలు విషయానికి వస్తే.. అధికార పార్టీ వైసీపీ ఓటమే లక్ష్యంగా.. ఆంధ్రపదేశ్ లో తెలుగుదేశం – జనసేన – బీజేపీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిస్తేనే.. సీట్ల పంపకాలు తేలేలోగా ఎన్నికలు ముగిసే సమయం వచ్చేస్తుంది. కానీ మూడు పార్టీలు కలిసినా.. ఏమాత్రం రాద్దాంతం లేకుండా.. తక్కువ సమయంలోనే సీట్ల లెక్క తేల్చేసుకున్నారు. స్థానికంగా ఎక్కడ సమస్య ఎదురైనా.. పరిష్కారం కోసం.. అవసరమైతే.. ఎవరికి వారు తగ్గేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడగానే.. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మ అనుచరులు మామూలు రాద్దాంతం చేయలేదు. ఏకంగా అగ్గిరాజేశారు. అధినేత అని కూడా చూడకుండా చంద్రబాబుపై కూడా నోరుపారేసుకున్నారు. ఈ విషయం తనదృష్టికి రాగానే పొత్తు ధర్మానికి కట్టుబడి ఆ సమస్య పరిష్కారానికి చంద్రబాబు నడుం బిగించారు. వర్మను పిలిపించి సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరించారు. పవన్ కల్యాణ్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తామని.. ఎవరైతే అగ్గిమీద గుగ్గిలం అయ్యారో వారితోనే చెప్పించారు. ఇది కూటమి ఐక్యతకు నిదర్శనంగా మారింది.
ఇక గుంటూరు పార్లమెంట్ విషయానికి వస్తే.. అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలోనూ టీడీపీ-జనసేన-బీజేపీ నేతలను సమన్వయపరిచి నడిపించే బాధ్యత ఆయన భుజాలపై వేసుకున్నారు. వైద్యుడిగా, ఓ కంపెనీ ఓనర్ గా, వేలాది మందికి చదువు చెప్పిన గురువుగా.. ఎన్నో టీమ్లను లీడ్ చేసిన లీడర్గా.. ఎంతో అనుభవం ఉన్న పెమ్మసాని.. గుంటూరు పరిధిలో కూటమి నేతలను ఐక్యంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఆయన ఏ కార్యక్రమం నిర్వహించినా.. అక్కడ మూడు పార్టీల జెండాలూ రెపరెపలాడుతున్నాయి. మూడు పార్టీల కార్యకర్తలూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డాక్టర్ పెమ్మసాని కూడా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. సమన్వయంగా ఉండాల్సిన ఆవశ్యకతను మూడు పార్టీల కార్యకర్తలకూ వివరిస్తూ పెమ్మసాని వారిని కార్యోన్ముఖులను చేయడంలో సక్సెస్ అయ్యారు.
వైసీపీ విముక్తాంధ్రప్రదేశే ధ్యేయంగా పని చేయాలని పిలునిస్తున్నారు. చిన్న చిన్న అసంతృప్తులున్నా సర్దుకొని పోవాలని, అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కార్యకర్తలను ఐక్యం చేస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో వైసీపీ సాగించిన విచ్చిన్న పాలనను ఎండగట్టడంలోను, ఎన్డీఏ కూటమి విజయావకాశాలను వివరించడంలోనూ పెమ్మసాని ఆకట్టుకుంటున్నారు. అందుకే.. కలిసికట్టుగా మూడు పార్టీల నేతలతో కలిసి వస్తున్న పెమ్మసానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. దీంతో గుంటూరు పార్లమెంట్ పరిధిలో కలిసిమెలిసి ప్రచారం చేస్తున్న కూటమి విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY