ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు అధికార వైసీపీ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగానే వారంలో ఐదు రోజుల పాటు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. అయితే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను భవన నిర్మాణ సమయంలోనే చేయడం గమనార్హం. కాగా దీనిపై కచ్చితమైన నిర్ణయమైతే ఇంకా తీసుకోలేదని, మరికొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుందని వెల్లడించాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం సీఎం జగన్ త్వరలోనే దీన్ని చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ఆగస్టు నుంచి ప్రజాదర్బార్ చేపట్టే అవకాశం ఉందని సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం వేళలో ప్రజల నుంచి విజ్ఞప్తులను సీఎం స్వీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కూడా ఆయన సమావేశమవుతారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో సీఎం జగన్ పార్టీకి తగినంత సమయం కేటాయించటానికి కుదరనందున, ఇకపై ఎమ్మెల్యేలతో సహా జిల్లా స్థాయి నాయకులతోనూ భేటీ అయ్యి వారి సమస్యలపై కూడా దృష్టి పెట్టనున్నారని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరో రెండేళ్లలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ