ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఖరీఫ్-2020 సీజన్కు సంబంధించి “వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం” నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 2020 ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన 15.15 లక్షల రైతులకు రూ.1820.23 కోట్ల బీమా పరిహారం అందిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా ఆ నగదును జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఈ మే నెలలోనే ఇప్పటికే రైతు భరోసా కింద రైతులకు రూ.3928 కోట్లు అందించామని, ఈరోజు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం కింద రూ.1820 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బీమా క్లెయిమ్ బకాయిలతో పాటుగా 2019-20 వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా క్లెయిమ్ కింద రూ.1252 కోట్ల కలిపి మొత్తం రూ.1968.02 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. తాజాగా అందించే రూ.1820 కోట్లతో కలిపి మొత్తం రూ.3788.25 కోట్ల బీమా పరిహారం చెల్లించినట్టు అవుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతులకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. భూమి సాగు చేస్తూ ఈ–క్రాప్లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియమ్ను ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ