ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ సందర్భంగా పాటించాల్సిన పలు నియమాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారిని అదుపు చేయాలంటే లాక్డౌన్ ప్రకటించిన మూడు వారాల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాలని, బయటకు రావొద్దని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం లేదని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి.
- వందేళ్లకో అంతకంటే ఎక్కువ కాలానికి వచ్చే ఇటువంటి వ్యాధులను ఇప్పుడు మన జీవిత కాలంలో ఇప్పుడు చూడాల్సివస్తుంది.
- మార్చ్ 25 , బుధవార రాత్రి జరిగిన కొన్ని ఘటనలు నా మనసును కలిచి వేశాయి. మన వాళ్లను కూడా మనం చిరునవ్వుతో రాష్ట్రంలోకి ఆహ్వానించే పరిస్థితి లేక పోవడం తీవ్ర బాధను కలిగించింది.
- ఈ పరిస్థితుల్లో మనమంతా ఇళ్లకు పరిమితం కాకపోతే కరోనా ను అదుపు చేయలేం.
ఇప్పుడు ప్రయాణాల పేరుతో ప్రదేశం మారుతున్న వారు ఎంతోమందితో కాంటాక్ట్లో ఉండి ఉంటారు. వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తే ఇంకా ఎంత మందితో కాంటాక్ట్లోకి వెళ్తారో కనుక్కోవడం చాలా కష్టం. - ఏప్రిల్ 14 వరకు అందరు వారు అక్కడే ఉంటే, కరోనా యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ తేలిగ్గా తెలిసి పోతుంది. దీంతో వ్యాధి సోకిన వారిని వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించవచ్చు.
- మార్కాపురం, అద్దంకి, కందుకూరు వద్ద 200 మందికి పైగా అనుమతించాం. వీరిని మానవతా దృక్పథంతో అనుమతించినా, వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు కాబట్టి వారందరినీ 14 రోజుల పాటుగా క్వారంటైన్లో ఉంచక తప్పడం లేదు.
- విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు మొత్తం 27,819 మంది ఉన్నారు. వారందరిపై నిఘా ఉంచి ట్రాకింగ్ చేస్తున్నాం.
- విశాఖ, విజయవాడ, తిరుపతి,నెల్లూరు లలో క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం.
ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 470 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు, అదనపు పడకలు అందుబాటులో ఉన్నాయి. - ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు, అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు.
- కొన్ని ప్రైవేటు ఆసుపతుల్లో కూడా 213 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
- కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఇందులో పది మంది సీనియర్ రాష్ట్ర అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు
- ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్ రూమ్లను పర్యవేక్షిస్తారు. ఇక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు.
- నిత్యావసర వస్తువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ భయం అక్కర్లేదు. ఎలాంటి నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు.
- పంటలు కోత సమయం కాబట్టి రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లండి. కానీ అక్కడ కూడా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించండి.
- ప్రజలంతా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలని చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.