పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చ్ 23, సోమవారం నాడు ఉభయ సభల్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 3వ తేది వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించి వాయిదా నిర్ణయాన్ని వెల్లడించారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఈ సమావేశాల సందర్భంగా లోక్సభ ఉత్పాదకత 90 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 74 శాతం ఉందని చెప్పారు. బడ్జెట్ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 మధ్య కాలంలో రెండు విడతలుగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. అయితే ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత సజావుగా సాగిందని, మార్చ్ 2 న ప్రారంభమైన రెండో విడత రెండువారాల ముందే ముగించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సెషన్లో లోక్సభలో 18, రాజ్యసభలో ఒకటి కలిపి మొత్తం 19 బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాగే లోక్సభ 15 బిల్లులను, రాజ్యసభ 13 బిల్లులను ఆమోదించిందని తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు కలిపి 12 బిల్లులను ఆమోదించినట్లు పేర్కొన్నారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా