ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్కుమార్ నే తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జూన్ 10, బుధవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. విచారణలో భాగంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులుకీ నోటీసులు జారీ చేస్తున్నామని, రెండు వారాల్లోగా వారంతా కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం కోసమే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చిందని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. నిమ్మగడ్డ రమేశ్కుమార్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే వాదిస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరారు. ఇరువర్గాల వాదనలు అనంతరం హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరిస్తూ, ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని, రెండు వారాల తర్వాత ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu