ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్న అవకతవకలతో పాఠశాల విద్యాశాఖ అన్ని పరీక్షా కేంద్రాలను ‘నో-ఫోన్ జోన్లు’గా ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు చీఫ్ సూపరింటెండెంట్లతో సహా, విధుల్లో ఉండే ఇన్విజిలేటర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరూ ఫోన్లను పరీక్షా కేంద్రాలలోకి తీసుకుని వెళ్ళకూడదు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి కూడా ఇదే షరతు వర్తిస్తుందని వెల్లడించారు. స్మార్ట్వాచ్లు, డిజిటల్ వాచీలు, బ్లూటూత్స్, ఇయర్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఫిట్నెస్ ట్రాకర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. విద్యాశాఖ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ నివారణ కోసం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఒకవేళ ఎవరి వద్ద అయినా ఫోన్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ గుర్తిస్తే అది వెంటనే జప్తు చేయబడుతుంది. దీంతో పాటు ఇన్విజిలేటర్ల జంబ్లింగ్ను అమలు చేయాలని విద్యాశాఖ సూచించింది. పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 3,700 కేంద్రాల్లో ఏప్రిల్ 27న ప్రారంభమై మే 7 వరకు కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో అవకతవకలకు పాల్పడినందుకు 30 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేయగా, 44 మంది అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ