ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ప్రజల్లో అపోహలు సృష్టించే దురుద్దేశంతోనే రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ప్రజలెవరూ దీనిని నమ్మొద్దని ఆయన కోరారు. 2019 నుంచి కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా అప్పులు చేయాల్సి వచ్చిందని, అయితే ఇది ఒక్క ఏపీ లోనే కాదని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వసాధారణంగా జరిగేదే అని మంత్రి బుగ్గన తెలిపారు.
వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారని, అది దేశంలోని అన్ని రాష్ట్రాలను ఉద్దేశించి చెప్పారని, కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా అప్పులు చేశారని, దానితో పోలిస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో తక్కువ అప్పులు చేశామని మంత్రి వెల్లడించారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లుగా ఉందని, తమిళనాడులో దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర అప్పు పెరిగిందని తెలిపారు. పొరుగు రాష్ట్రాలలో 4% కంటే ఎక్కువ ద్రవ్యలోటు ఉండగా, మన రాష్ట్రంలో ద్రవ్యలోటు 2014లో 3.95% ఉన్నదాన్ని 2021-22లో 3% కి తగ్గించామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ