ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులు కాగా, 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని చెప్పారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,58,449 మంది ఉత్తీర్ణులు కాగా, 61శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయిగా ఉందని మంత్రి తెలిపారు. మరోవైపు జూన్ 25 నుంచి జూలై 7 వరకు రీకౌంటింగ్ కి దరఖాస్తు అవకాశం ఇస్తున్నామని, ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ముందుగా ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2022లో భాగంగా మే 6 నుంచి మే 23 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మే 7 నుంచి మే 24 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో, రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY