ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా తొలిసారిగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా విచ్చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరి వెళ్లారు. విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న గవర్నర్ దంపతులు అక్కడినుంచి నేరుగా రోడ్డు మార్గంలో సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయానికి చేరుకున్నారు. తొలిసారిగా సింహాచలం విచ్చేసిన గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు. సింహగిరికి చేరుకున్న గవర్నర్ దంపతులకు తొలుత గోదాదేవి అమ్మవారి సన్నిధిలో మంగళహారతులిచ్చాక బేడా మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలిచ్చారు.
ఈ సందర్భంగా సింహాచలం క్షేత్రం లోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ఉన్న ‘కప్ప స్తంభం’ ఆలింగనం చేసుకొని, అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిఖర దర్శనం చేసుకున్న తర్వాత గవర్నర్ దంపతులకు ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం గవర్నర్ బిశ్వభూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. మొదటిసారిగా అప్పన్న స్వామిని దర్శించుకుంటున్నానని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్యను ప్రస్తావించగా, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, అయితే దీనిపై లిఖిత పూర్వకంగా తనకు అందజేయాలని హరిచందన్ పేర్కొన్నారు.
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ