గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం తలైగావ్లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్ళై ప్రమోద్ సావంత్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. గోవాలో బీజేపీ అధికారం చేపట్టడం వరుసగా ఇది మూడోసారి కాగా, ప్రమోద్ సావంత్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రమోద్ సావంత్ తో పాటుగా మరో 8 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అలాగే బీజేపీ కార్యకర్తలు, ప్రజలు కూడా భారీగా హాజరయ్యారు.
ముందుగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మెజార్టీ సీట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ అయినా 21 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటులో దూరంలో నిలిచిన బీజేపీకి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దమయింది. బీజేపీ అధిష్ఠానం మరోసారి ప్రమోద్ సావంత్ కే సీఎంగా అవకాశమిస్తూ నిర్ణయం తీసుకోగా, సోమవారం ఉదయం గోవా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ