ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. కాపులతో సహా ఎస్సీ/ఎస్టీలు/బీసీలు/మైనారిటీలు/ఈబీసీలకు చెందిన అర్హులైన విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఆర్థిక సహాయం అందించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30 గా నిర్ణయించిన ప్రభుత్వం ఈలోపు అన్ని వివరాలను అందించాలని సంబంధిత విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె హర్షవర్ధన్ ఒక ప్రకటనలో.. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీల్లో 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్లు కలిగిన విద్యార్థులు విదేశీ విద్యా దీవెన ప్రయోజనం పొందడానికి అర్హులని తెలియజేశారు. ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులు ‘నీట్’ లో అర్హత సాధించి ఉండాలని స్పష్టం చేశారు. కాగా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో https://jnanabhumi.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రపంచంలోని టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ అభ్యసించడానికి ఈ పథకం కింద ఆయా విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. టాప్ 100 క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్ సంస్థలు/విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన వారికి 100% ట్యూషన్ ఫీజుతో 100% ఆర్థిక సహాయం అందించబడుతుంది. అలాగే 50% ట్యూషన్ ఫీజు లేదా `50 లక్షలు, ఏది తక్కువైతే అది 101 నుండి 200 ర్యాంక్ పొందిన సంస్థలు/విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన వారికి అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపు విద్యార్థులు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఒకరికి మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY