ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ రాష్ట్రంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పండే జయ రకం (ఎంటీయూ 3626 బోండాలు) ధాన్యం, బియ్యం సహా పలు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. కాగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ని పరిశీలించారు. ఈ క్రమంలో ఏపీలోని లబ్ధిదారులకు నిత్యావసరాలను డోర్ డెలివరీ చేస్తున్న రేషన్ విధానాన్ని ప్రశంసించిన ఆయన, రెండు రాష్ట్రాల మధ్య కొన్ని కిరాణా వస్తువులను పరస్పరం సేకరించాల్సిన అవసరాన్ని ఏపీ దృష్టికి తెచ్చారు. దీనికోసం కేరళలో పర్యటించాల్సిందిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో మంత్రి నాగేశ్వరరావు నేతృత్వంలోని పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి వీరపాండియన్, ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు తదితర ఉన్నతాధికారుల బృందం మంగళవారం కేరళలో పర్యటించింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మంత్రులు మరియు అధికారులు కొన్ని కీలక అంశాలపై చర్చించారు, దీని తరువాత బియ్యంతో పాటు పసుపు, పప్పులు, వేరుశెనగ, కొత్తిమీర విత్తనాలు మరియు ఎండుమిర్చి వంటి నిత్యావసర వస్తువులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (ఏపీ మార్క్ఫెడ్) ద్వారా ఏపీకి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఏపీ మార్క్ఫెడ్ కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (సప్లైకో)కి చెందిన మావేలి స్టోర్స్ ద్వారా కేరళకు నిత్యావసరాలను సరఫరా చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE