ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా – రంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలలోని కాపు నేతలు హాజరుకానున్నారు. ఇక ఈ సభలో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని పొందే దిశగా సమాలోచనలు చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలోని కాపు నాయకులు హాజరవనున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు ప్రధానాకర్షణగా నిలవనున్నారు. ఇక ఈ సభ కోసం నిర్వాహకులు విశాఖలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు దీనికి నాయకత్వం వహించనున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఆయన దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా బడుగు, బలహీన వర్గాల నాయకుడని, ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో ఆయనను పరిమితం చేయడం తగదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కాపు నేతలు ఈ సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తద్వారా కాపు నేతల ఐక్యతను చాటిచెప్పాలని సాటి కాపు సోదరులను కోరుతున్నానని తెలిపారు. కాగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ మాత్రం ఈ కాపునాడు సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE