తప్పు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స, సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణ అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తూ.. పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందని, దీనిలో భాగంగా పోలీసులు ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేశారని వెల్లడించారు.
అరెస్టైన వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు కూడా ఉన్నారని, వీరిలో నారాయణ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారని మంత్రి బొత్స తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ పాత్రపై పోలీసులు విచారణ చేసి నిజాలు వెలికితీస్తారని, అయితే నారాయణ కూడా తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేస్తే ఎవరైనా సరే, వదిలేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అయితే ఈ అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యగా టీడీపీ నేతలు అభివర్ణించారు. ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడు విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రతిపక్ష పార్టీ నాయకులను తప్పుడు కేసుల కింద అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటని టీడీపీ ఆరోపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ