త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ దఫా ఇదే చివరి బడ్జెట్. దాంతో గతానికి భిన్నంగా ఈసారి బడ్జెట్ పై అంచనాలు ఉన్నాయి. అయితే.. బడ్జెట్ ఆ అంచనాలను అందుకుందా, లేదా అన్నది ఆసక్తిగా మారింది. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే భారీ స్థాయిలో తాయిలాలు, పలు పథకాలకు నిధులు, సంక్షేమ వాటా పెంచడం చేస్తూ ఉంటారు. కానీ ఈ బడ్జెట్ లో విద్య, ఆరోగ్య రంగానికి మాత్రమే అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరిచి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగన్ సర్కారు పనిచేస్తోందని చెప్పిన బుగ్గన ఆ రంగాలనే ఎక్కువగా ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతగా వ్యతిరేకత కనిపించని కార్యక్రమం ఏమైనా ఉందంటే అది పాఠశాలల అభివృద్ధి. అందుకే ప్రభుత్వం కూడా దాన్నే ప్రత్యేకంగా చెప్పుకునే ప్రయత్నం చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన అమలు చేస్తున్నామని చెప్పారు. వెయ్యికి పైగా స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఐబీ విధానం, వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన వివరించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఇందుకోసం రూ.3367 కోట్లు ఖర్చుచేశామని వివరించారు. మరో 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ అందించేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకానికి రూ.11,901 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి రూ.4,267 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకాలతో 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందన్నారు. స్కూళ్లలో గతంలో విద్యార్థుల డ్రాపౌట్ 20.37 శాతంగా ఉండగా.. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, తీసుకున్న చర్యలతో ఇది 6.62 శాతానికి తగ్గిందన్నారు. ఇక విదేశీ విద్యాదీవెన కింద ఇప్పటి వరకు 1,858 మంది విద్యార్థులు ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులకు తగిన ఉద్యోగం సాధించుకునేలా వర్చువల్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ అందించామని, దీంతో 95 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. దీంతో పాటు ఇదే రోజున డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులను అకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రహదారుల దుస్థితిపై తీవ్రమైన స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఈ బడ్జెట్ లో చేయలేదు. గత ఐదేళ్లలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 2,626 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.1955 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించి, భవిష్యత్ లో చేపట్టబోయే పనులను వివరించలేదు. మొత్తంగా రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్ రూపొందించగా, అందులోరెవెన్యూ వ్యయం – రూ. 2,30,110 కోట్లు, మూలధన వ్యయం – రూ. 30,530 కోట్లుగా చూపించారు. ద్రవ్యలోటు – రూ.55,817 కోట్లు, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం, రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటుతో ఏపీ బడ్జెట్ ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE