ఆంధ్రప్రదేశ్లో వరుసగా పెరుగుతున్న ఇంధన, కరెంట్ చార్జీలపై తెలుగుదేశం పార్టీ తాజాగా ‘బాదుడే బాదుడు’ అనే నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొవ్వొత్తుల వెలుగులో, సెల్ ఫోన్స్ వెలుగులో ప్రసవాలు చేయాల్సి రావడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని, దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అధిష్టానం ఆదేశించింది. కాగా ఈరోజు దీనిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నులపై శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇన్ చార్జ్ సీరియస్గా తీసుకోవాలని, ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను కూడా స్వయంగా పాల్గొంటానని తెలిపారు. ప్రతి కార్యకర్తా తమ ప్రాంతాల పరిధిలో ఇంటింటికి వెళ్లి కొవ్వొత్తులు, అగ్గిపెట్టె, బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు. విద్యుత్ కోతలతో ఒకవైపు రాష్ట్రంలోని పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులు, మరోవైపు పంటలకు సకాలంలో నీరు అందక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీనికి కారణమైన సీఎం జగన్ను గద్దె దించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ