విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్లదే కీలక పాత్ర, నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సోమవారం ఆయన విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 176 మంది అధ్యాపకులను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వారు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులు మాత్రమే గుర్తించగలరని, వారిని తీర్చిదిద్దే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే వారికి జీవితాన్నిచ్చేది గురువులని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక సంస్కరణలను తీసుకొచ్చామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని వివరించారు. పాఠశాలల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచడానికై నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిలో భాగంగా వారికి డిజిటల్ విధానంలో బోధనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే టీచర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచామన్న సీఎం జగన్, ఈ క్రమంలో ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేశామని, అలాగే ఉద్యోగుల పెన్షన్ల విషయంలోనూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. తాము ఇన్ని చేస్తున్నా, మరోవైపు ప్రతిపక్షాలు టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు తమకు ఉపాధ్యాయులు కూడా ముఖ్యమేనని ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ