రాష్ట్రంలో హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీరు అందుబాటులోకి రావడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలసి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ఇద్దరు మహిళా డైరెక్టర్లతో పాటు మంగళవారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మదర్ డైరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఇప్పటికే విజయా డైరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. అందులో ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ఏర్పడిన రోజు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయా డైరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అటువంటి డైరీని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నార్ముల్ కు ఎన్నికయిన కొత్త డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలందర్ రెడ్డి, రచ్ఛా లక్ష్మి నరసింహా రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డిలతో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోములభగత్, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ