జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సాయం పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన 213 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.19.95 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు సీఎం జగన్ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ మోడ్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయమని, దీనిద్వారా అన్ని వర్గాలలోని పేద విద్యార్థులకు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించామని, తద్వారా ప్రపంచ వేదికపై రాష్ట్రంతో పాటు దేశం జెండా ఎగురవేయాలని విద్యార్థులకు సూచించారు. విద్య వల్ల ఆయా కుటుంబాల తలరాతలే కాదని, రాష్ట్రం భవిష్యతే మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కాగా ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద, సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని ప్యానెల్ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీల్లో అడ్మిషన్ సాధిస్తే ఇతరులకు గరిష్టంగా రూ.1 కోటితో మొత్తం విద్యా వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే ప్రపంచంలోని 100 – 200 మధ్య ర్యాంక్ ఉన్న విశ్వవిద్యాలయాలలో సీట్లు పొందిన వారికి, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు మరియు మైనారిటీలకు రూ. 75 లక్షల వరకు మరియు ఇతరులకు రూ. 50 లక్షల వరకు సహాయం అందించబడుతుంది. విద్యార్థులు వారి ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన వెంటనే మొదటి విడత, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత రెండవది, రెండవ మరియు మూడవ సెమిస్టర్ల తర్వాత మూడవ మరియు నాల్గవ విడత సహాయం అందించబడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE