ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి 17 వరకు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం కొనసాగనుంది. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనున్న ఈ మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మహా యజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు సీఎం జగన్ రేపు ఇందిరా గాంధీ స్టేడియానికి రానున్నారు. మొత్తం 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది ఋత్విక్కులతో ఈ మహా యజ్ఞం జరగనుంది. ఇక ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇప్పటికే వీరిద్దరినీ కలిసి యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలికారు.
కాగా దేవాదాయ శాఖ ఈ యాగం కోసం పోలీస్ శాఖ సహకారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. మహా యజ్ఞానికి సంబంధించి డీసీపీ విశాల్ గున్నీ స్టేడియం వద్దే ఉండి ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు చెందిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులు మొదలుకొని కమిషనర్ స్థాయి అధికారుల వరకూ ఈ యజ్ఞానికి హాజరుకానున్నట్లు దేవాదాయ శాఖ తెలిపింది. యజ్ఞంలో భాగంగా ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ హోమం జరుగనుందని, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి సోత్త్రపారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పింది. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కళ్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నామని, ఆఖరి రోజు ఈనెల 17న పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుందని దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో యజ్ఞం మొదటిరోజు మరియు ఆఖరిరోజున రాజశ్యామల యజ్ఞంలో సీఎం జగన్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE