రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ‘విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ పథకాలు అందాలని విద్యాశాఖాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బు లేని కారణంగా రాష్ట్రంలోని ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్ మెంట్ను ‘విద్యా దీవెన’ పథకం కింద అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే విద్యతో పాటు వసతి కూడా ముఖ్యమేనని అందుకే ‘వసతి దీవెన’ పథకాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఈ రెండు పథకాల వలన పాఠశాలల్లో, కాలేజీల్లో విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెరిగిందని, అయితే దీంతోనే మనం సంతృప్తి చెందకూడదని, 80 శాతానికి పైగా ఉండేలా లక్ష్యం పెట్టుకోవాలని అధికారులకి సూచించారు.
అలాగే ప్రతి విద్యార్థిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇంగ్లీష్ భాషపై పట్టు ఉంటేనే వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. జీఆర్ఈ, జీ మ్యాట్ పరీక్షలలో విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలని, వీటిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇకపై పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్షిప్ అమలుచేయాలని, కోర్సులో భాగంగానే మొదటి రెండు సంవత్సరాలకు ఏడాదికి 2 నెలలు చొప్పున, మూడో ఏడాదికి 6 నెలల ఇంటర్న్షిప్ విధానం అమలు చేయాలని సూచించారు. టీచింగ్ ఫ్యాకల్టీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సిఫార్సులకు తావు లేకుండా ప్రతిభ ఉన్నవారినే టీచింగ్ స్టాఫ్గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ