ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కని వారికి కొత్తగా అవకాశం కల్పించింది ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కొత్త లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల నిధులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా సంక్షేమ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ నిస్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, అవినీతికి తావు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం అందించే సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పొందే అవకాశం కల్పించాలని భావించామని, అందుకే ఇప్పటికే ఉన్న వారికి అదనంగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలను పథకాలకు ఎంపిక చేశామని సీఎం జగన్ తెలిపారు. తాజాగా ఎంపిక చేసిన కుటుంబాల కోసం రూ.137 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు. ఇంకా వైఎస్సార్ పింఛన్ కానుక పథకానికి కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేశామని, దీంతో పాటు కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,39, 096 మందికి ఇక నుంచి ఆయా సంక్షేమ పథకాలు అందనున్నాయని, అలాగే ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ