ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘దిశ యాప్’ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ దిశా యాప్ వినియోగంపై మహిళలు, విద్యార్థినులు, యువతులకు మరింత అవగాహన, చైతన్యం కల్పించేలా ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి దిశ యాప్పై అవగాహన కల్పించి, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. దిశ యాప్కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లని పేర్కొన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఈ దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు.
దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే:
అలాగే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని, ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని చెప్పారు. ఆపద ఎదురైనపుడు యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే, ఆడియో, వీడియో రికార్డ్ అయి వివరాలు నేరుగా కంట్రోల్ రూం చేరతాయని, సమీప పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని సహాయం చేస్తారని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని, దిశ చట్టం కూడా తెచ్చామని తెలిపారు. ఇక దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ