ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల వద్ద ఎలాంటి కలుషిత వాతావరణం లేకుండా, పిల్లలు చెడు అలవాట్లు వైపు మళ్లకుండా ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు పాన్, గుట్కా, సిగరెట్లు విక్రయించే షాపులు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ నిబంధనల అమలును పర్యవేక్షించనుంది. ఇకపై ప్రభుత్వ స్కూళ్ల వద్ద పరిస్థితులను ఏఎన్ఎంలు పర్యవేక్షించనున్నారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు లేదా మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగిస్తారు. ఏఎన్ఎంలు ప్రభుత్వ పాఠశాలల వద్ద పరిస్థితులను పరిశీలించి, అక్కడి ఫొటోలు తీసి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్న ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కోసం ప్రతి పాఠశాలను మ్యాపింగ్ చేసి, ఆన్లైన్ పోర్టల్ కు అనుసంధానం చేస్తారు.
ఈ సమాచారం ఆధారంగా పాఠశాలల సమీపంలో ఎవరైనా సిగరెట్, గుట్కా, పాన్షాపులు నిర్వహిస్తే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.అలాగే పాఠశాలల సమీపంలో మద్యం షాపులు నిర్వహణ లేదా మద్యం సేవించిన వారిపై కఠినచర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పాఠశాల ఆవరణలో స్మోకింగ్ చేసే ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ప్రత్యేక యాప్ అందుబాటులోకి రాగానే ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ