ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను విడుదల చేయనున్నారు. కాగా గత నెలలోనే జరగాల్సిన ఈ కార్యక్రమం అనుకోని కారణాలతో రెండుసార్లు వాయిదా పడగా.. చివరికి బుధవారం దీనిని నిర్వహించనున్నారు. బటన్ నొక్కడం ద్వారా సీఎం జగన్ నగదును నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి పయనించే మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించామని, కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ మేరకు ఆమె సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమం తీరుతో పాటు ఆయన ప్రసంగించే బహిరంగ సభను జిల్లా కలెక్టర్ కె. మాధవీలతతో కలిసి పరిశీలించారు.
కాగా ఏపీలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తోంది. దీనిద్వారా విద్యార్థులకు హాస్టల్ వసతి మరియు ఇతరత్రా ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం అందిస్తోంది. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులకు రూ.20,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, ఐటీఐ విద్యార్థులకు రూ.10,000 చొప్పున ప్రతి ఏటా రెండు విడతలుగా అందజేస్తున్నారు. ఇక ‘జగనన్న విద్యా దీవెన’ మరియు ‘జగనన్న వసతి దీవెన’ పథకాలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.13,311 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE