కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై రాష్ట్రాలకు నిర్ణయాధికారాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వారు పాటించాల్సిన నిబంధనలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత నిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణీకులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. అలాగే పాస్ ద్వారా ఏపీకి వచ్చేవారిని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే అనుమతించనున్నట్టు చెప్పారు. రాత్రిపూట వ్యక్తుల ప్రయాణాలకు అనుమతి లేదని, మెడికల్ ఎమర్జెన్సీ, అనుమతితో కూడిన అత్యవసర ప్రయాణాలు, సరకు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా అధికారులకు సహకరించాలని కోరారు. మరోవైపు తెలంగాణ నుంచి పాసులు లేకుండా ఏపీకి వస్తున్న వారిని సరిహద్దులనుంచి పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu