ఎన్నికలవేళ ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారం కాక రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వీలుగా భారీ ఎత్తున నకిలీ ఓట్లను చేర్పించారని ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగు దేశం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఎన్నికల సంఘం వరకు కూడా వెళ్లింది. నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఏపీలో మొత్తం 14 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాయి.
ఈక్రమంలో నకిలీ ఓట్లపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం.. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించింది. ఈ మేరకు మొత్తం 5.6 లక్షల ఓట్లను తొలగించింది. 14 లక్షల ఓట్లల్లో 5.6 లక్షల నకిలీ ఓట్లను తొలగించి.. మిగిలిన ఓట్లను కొనసాగించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగివున్న 1.51 లక్షల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టామని.. ఉద్దేశపూర్వకంగా ఫామ్-6, ఫామ్-7 దాఖలు చేసిన వారిపై 70కి పైగా కేసులు నమోదు చేశామని వివరించింది. నకిలీ ఓట్లు నమోదు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక తాజా సవరణ తర్వాత ఏపీలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 27న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత మొత్తం 5.08 లక్షల ఓటర్లు పెరిగినట్లు వివరించింది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా కర్నూలు 20,19,396 ఓట్లతో మొదటి స్థానంలో ఉంది. అలాగే 19,96,637 మంది ఓటర్లతో అనంతపురం.. 19, 46, 224 మంది ఓటర్లతో విశాఖపట్నం జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా 7,61,538 మంది ఓటర్లతో అతి తక్కువ మంది ఓటర్లు కలిగిన జిల్లాగా చివరి స్థానంలో ఉంది.
మంగళవారం నుంచి కొత్త వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వివరించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. కాలేజీలు, యూనివర్సిటీల్లో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE