ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థుల కొరత ఉందా..? ధీటైన అభ్యర్థుల ఎంపికకు అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపసోపాలు పడుతున్నారా..? అందుకే నిబంధనలను పక్కకు పెట్టి ఒకే కుటుంబానికి చెందిన వారైనా.. టికెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన అన్నీ కుదిరితే బీజేపీ కలిపి వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఢీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎలాగైనా మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ కూడా అప్రమత్తం అయ్యారు. సర్వేల మీద సర్వేలు నిర్వహించి ప్రస్తుత ఎమ్మెల్యేల స్థానంలో చాలా చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నా.. ప్రత్యర్థులను ఎదుర్కొనే సరైన అభ్యర్థుల కోసం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గట్టి అభ్యర్థి అయితే.. నిబంధనలను సైతం సవరించి, ఒకే కుటుంబంలో ఇద్దరి, ముగ్గురికి కూడా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ ఇన్చార్జుల జాబితాల మీద జాబితాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ప్రస్తుతం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, ఇతర కారణాలతో చాలా మందిని జగన్ మార్చే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు, పది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ ఇంచార్జ్లను మార్చేశారు. ఆయా జాబితాలను పరిశీలిస్తే.. ఆ పార్టీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో రెండేసి టికెట్లు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని విశాఖ లోక్సభ స్థానానికి, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ స్థానానికి ఇన్చార్జులుగా నియమించారు. కుటుంబం నుంచి ఒక్కరికే అవకాశమని చెబుతూ వచ్చిన జగన్.. అభ్యర్థుల కొరత కారణంగా దీనిని పక్కనపెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
గతంలో శ్రీకాకుళం లోక్సభకు పోటీచేసిన దువ్వాడ శ్రీనివాస్ను టెక్కలి అసెంబ్లీకి.. టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసిన పేరాడ తిలక్ను శ్రీకాకుళం లోక్సభకు ఇన్చార్జులుగా నియమించారు. ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి నిరాసక్తత చూపడంతో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్కు అవకాశమిచ్చారు. ఇక టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి అక్కటే టికెట్ ఇచ్చారు. ఇంతకాలం వైసీపీలో కొనసాగుతున్న పొట్లూరి వరప్రసాదరావును పక్కనపెట్టి.. ఇంకా అధికారికంగా పార్టీ కండువా కూడా కప్పుకోని నానికి అవకాశమివ్వడం గమనార్హం. కర్నూలులో బీసీ నేత సంజీవ్కుమార్కు అనుకున్నట్లుగానే మొండిచేయి చూపారు. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాంను ఇన్చార్జిగా నియమించారు.
పోటీ కి ఎక్కువ మందే ఆసక్తి చూపుతున్నప్పటికీ.. సరైన అభ్యర్థులు లేరని జగన్ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఒకే కుటుంబమైనా పలువురికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మంత్రి బొత్స ఇప్పటికే చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరికి మళ్లీ టికెట్లు ఖాయమేనంటున్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, విజయనగరం జిలా పరిషత్ చైర్మన్గానూ కొనసాగుతున్నారు. ఇక్కడ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ను కాదని మజ్జికి తాజాగా అవకాశమిచ్చారు. విశాఖపట్నం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీలక్ష్మికి అవకాశం కల్పించారు.
అలాగే.. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేశ్ను కొండపి ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు సతీశ్ను కోడుమూరు (ఎస్సీ) ఇన్చార్జిగా నియమించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్కుమార్కు ఏలూరు లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు మిథున్రెడ్డి రాజంపేట ఎంపీగా, పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ముగ్గురికీ టికెట్లు దాదాపు ఖాయమే అని ప్రచారం జరుగుతోంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE