ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలోకి మరోసారి భారీస్థాయిలో వలసలు మొదలయ్యాయి. కీలక నాయకులతో పాటుగా జిల్లా, మండల స్థాయిల్లో కూడా పలు పార్టీల నుంచి పలువురు వైసీపీలో చేరుతున్నారు. మార్చ్ 9, సోమవారం నాడు వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్లు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
తాజాగా మంగవారం నాడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా వైసీపీలో చేరారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో బాలరాజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బాలరాజుతో పాటుగా ఆయన కుమార్తె డాక్టర్ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పలువురు నేతలు వైసీపీలో చేరగా, వారికీ విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బాలరాజు జనసేన పార్టీలో చేరారు. పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల క్రితం జనసేనకు రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలరాజు మంత్రిగా పనిచేశారు.
[subscribe]