విజయనగరం సభ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ వాసులకు హామీల వర్షం కురిపించారు. అదే సమయంలో అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో వైసీపీలాంటి పార్టీని చూడలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మూడు దశబ్దాలు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండాల్సిన నాయకుడు కాదని.. అందుకే ఈసారి ఆయన్ను ఓడించి ఇంటికి సాగనంపాలని జనాలను కోరారు.
ఏపీ ప్రజల కోసమే.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ బాగుపడాలన్నా.. తిరిగి రాష్ట్రానికి పూర్వవైభవం రావాలన్నా తమ కూటమిని ప్రజలు ఆదరించాలని కోరారు. అలాగే చంద్రబాబు జనాలను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని గుప్పించి కాంగ్రెస్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
అలాగే తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఏడాది మహిళల ఖాతాలో రూ. 15 వేలు వేస్తామని చెప్పారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 1500 నగదును జమ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే రైతులకు ప్రతి ఏడాది రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారు.
విద్యలో యువతను ప్రపంచ స్థాయిలో నిలబెడుతామని వెల్లడించారు. తెలుగుదేశపార్టీ-జనసేన అధికారంలోకి వస్తే ఐదేళ్ల వ్యవధిలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇవన్నీ కొన్ని హామీలు మాత్రమేనన్న చంద్రబాబు.. త్వరలోనే మరిన్ని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలో అమరావతిలో మరో బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY