తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలు కూడా రానున్నాయి. ఎంతో శ్రమించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఆ ఎన్నికలు పెద్ద సవాలే. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారెంటీలను అతి త్వరలోనే అమలు చేసేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలకు ముందే వాటిని అమలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలనేది కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. లక్ష్యసాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగానే కృషి చేస్తున్నారు. ఓ వైపు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని శ్వేతపత్రం విడుదల చేస్తూ.. మరోవైపు గ్యారెంటీల కోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు పార్టీ ఢిల్లీ అధిష్ఠానం కూడా తెలంగాణ సర్కారుపై ఒత్తిడి పెంచుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ఎంపీ సీట్లు చాలా ముఖ్యం కావడం.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు సానుకూల ధోరణితో ఉండడం కలిసి వస్తుందని భావిస్తోంది. దీంతో ఎన్నికల లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరాలని హైకమాండ్ కూడా దిశానిర్ధేశం చేస్తోంది. ఈ నేపథ్యంలో హామీల అమలుకు రేవంత్ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ వాగ్దానాలను నిలబెట్టుకున్న రేవంత్.. ఈ నెల 28 నుంచి మరిన్ని అమలుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్యారెంటీలే కాకుండా.. మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నారు.
అందులో రైతు రుణమాఫీ ఇప్పుడు కీలకంగా మారనుంది. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారు. వాటిని మాఫీ చేసేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.40 వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ అస్తవ్యస్తంగా జరగడం, సకాలంలో లక్ష రుణమాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారిపోయారు. అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీలపై ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత త్వరగా అమలు చేస్తే ఆ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు పొందొచ్చు అనేది కాంగ్రెస్ ఆలోచన. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై రేవంత్ దృష్టి సారించారు. రుణమాఫీ చేయాలంటే రూ.32 వేల కోట్లు అవసరం ఉన్నాయి. ఈ నేపఽథ్యంలో.. ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. బ్యాంకర్లతో మాట్లాడి.. ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతోంది. అంటే.. రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకుంటుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని.. వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తుంది. దీనికి బ్యాంకర్లు ఎంత వరకు ఆమోదిస్తారన్నది తెలియాల్సి ఉంది. చెప్పినట్లుగానే కాంగ్రెస్ రుణమాపీ కూడా అమలు చేస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఆ పార్టీకి మెజార్టీ ఎంపీ సీట్లే వస్తాయని నేతలు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE