ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష నిర్వహించాలని గతనెలలో ఉన్నత స్థాయి కమిటీ ని నియమించింది. ఈ సమీక్ష పై ప్రభుత్వం ఒక జీవో కూడ జారీచేసింది. విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలు సరైన నిర్ణయం కాదంటూ, కేంద్ర విద్యుత్ సంస్థ రెండు సార్లు లేఖ రాసిన కూడ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షకు వెనకడుగు వేయక పోవడంతో, సంబంధిత విద్యుత్ సంస్థలన్నీ హైకోర్టుని ఆశ్రయించాయి. అయితే ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు,పీపీఏ ల పై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవో నెం.63ను తాత్కాలికంగా నిలివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతే కాకుండా ఒప్పందం చేసుకున్న విద్యుత్ సంస్థలకు, సంప్రదింపులకు రావాలని ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలను నాలుగువారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్ట్ 22 కు వాయిదా వేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు సూచించింది. యూనిట్ చార్జీలు తగ్గించి బకాయిల బిల్లును పంపాలని, టారిఫ్ ధరలు నచ్చకపోతే ఉన్నత స్థాయి కమిటీ ని సంప్రదించాలని, లేని పక్షంలో పీపీఏలు రద్దు చేస్తామని హెచ్చరించినట్టు విద్యుత్ సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు, జీవోను నిలిపివేయాలని తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
[subscribe]
[youtube_video videoid=OZuy49Wo-bs]