వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా అయిన రాజకీయ నాయకుడిగా పేరున్న ఆనం రాంనారాయణ రెడ్డి ఆందోళన చెందుతున్నారు అంటే మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి?, శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
“మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది. ప్రభుత్వ వ్యవహార శైలి గురించీ, తన నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం గురించి రాంనారాయణ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరం అని ప్రభుత్వ పెద్దలు భావించినట్లున్నారు. ఆయనకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రాంనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి. ఆయనకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియపరుస్తాను. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాణ భయంతో ఉన్నారు. అలాగే స్వేచ్చగా మాట్లాడుకొనే పరిస్థితి కూడా లేదు. సొంత ఎమ్మెల్యేలపైన నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? రాంనారాయణ రెడ్డి చేసిన ప్రాణ హానీ ప్రకటన, శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE